న్యూఢిల్లీ: చైనా నుంచి అనేక వస్తువులు భారత్లోకి దిగుమతి అవుతున్నాయని, ఈ తరహా పరిస్థితులు మారి.. ఎగుమతులను పెంచే దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎంఎస్ఎంఈ, రోడ్డు రవాణా శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా, తక్కువ ఖర్చుతోనే స్వదేశీ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. శనివారం వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ 93వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇందులో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ దిగుమతులు తగ్గి, ఎగుమతులు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పుంజుకుంటుందన్నారు. సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ను ప్రధాన పోటీదారుగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటున్నదన్నారు. కీలక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నట్లు వివరించారు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో..
కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులను అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిగమించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడగలదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ కొవిడ్-19 ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థలు గట్టెక్కాలంటే ఇదొక్కటే మార్గమన్నారు.